అలెగ్జాండర్
అలెగ్జాండర్ (సా.పూ 356 జూలై 20/21 - సా.పూ 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని బాసిలియస్ అంటారు), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని మాసిడోన్కు చెందిన అలెగ్జాండర్ III అని, అలెగ్జాండర్ ది గ్రేట్ (గ్రీకులో అలెగ్జాండ్రోస్ హో మెగాస్) అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, గ్రీస్ నుండి వాయవ్య భారతదేశం వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు.
అలెగ్జాండర్ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అరిస్టాటిల్ వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్కు గ్రీస్ సర్వసైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి తలపెట్టి, మొదలుపెట్టలేక పోయిన పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, పర్షియాను ఆక్రమించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు.[4][5] సా.పూ. 334 లో, అతను అకెమెనీడ్ సామ్రాజ్యం (పర్షియన్ సామ్రాజ్యం) పై దాడి చేశాడు. 10 సంవత్సరాల పాటు కొనసాగిన తన దండయాత్రలను మొదలుపెట్టాడు. అనటోలియా ఆక్రమణ తరువాత అలెగ్జాండర్, వరుసబెట్టి చేసిన నిర్ణయాత్మక యుద్ధాల్లో, ముఖ్యంగా ఇస్సస్, గ్వాగమేలా యుద్ధాల్లో పర్షియా నడుం విరగ్గొట్టాడు. తరువాత అతను పర్షియన్ రాజు డారియస్ III ను పడగొట్టి, అకెమెనీడ్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాడు. [b] ఆ సమయంలో, అతని సామ్రాజ్యం అడ్రియాటిక్ సముద్రం నుండి బియాస్ నది వరకు విస్తరించింది.
అలెగ్జాండర్ "ప్రపంచపుటంచులను, గొప్ప బయటి సముద్రాన్నీ" చేరుకోవడానికి ప్రయత్నించాడు. సా.పూ. 326 లో భారతదేశంపై దాడి చేశాడు. హైడాస్పెస్ యుద్ధంలో పౌరవులపై ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించాడు. ఇంటిపై గాలిమళ్ళిన తన సైనికుల డిమాండ్ మేరకు వెనక్కి తిరిగి వస్తూ, సా.పూ. 323 లో బాబిలోన్లో మరణించాడు. అరేబియాపై దండయాత్రతో మొదలుపెట్టి వరసబెట్టి అనేక రాజ్యాలను జయించాలనే ప్రణాళికను అమలు చెయ్యకుండానే, భవిష్యత్తులో తన రాజధానిగా చేసుకుందామనుకున్న నగరంలో మరణించాడు. తరువాత సంవత్సరాల్లో వరుసగా జరిగిన అనేక అంతర్యుద్ధాలతో అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమై పోయింది. దీని ఫలితంగా డియాడోచి అనే పేరున్న అతడి అనుచరగణం వివిధ రాజ్యాలను స్థాపించుకున్నారు.
అలెగ్జాండర్ వారసత్వంగా వచ్చినవాటిలో సాంస్కృతిక వ్యాప్తి ఒకటి. గ్రీకో-బౌద్ధమతం వంటి సమకాలీకరణను కూడా అతని విజయాలు అందించాయి. అతను తన పేరుతో ఒక ఇరవై దాకా నగరాలను స్థాపించాడు. వాటిలో ముఖ్యమైనది ఈజిప్టులోని అలెగ్జాండ్రియా. అలెగ్జాండర్ తాను గెలిచిన ప్రాంతాల్లో గ్రీకు ప్రతినిధులను స్థాపించడం, తద్వారా తూర్పున గ్రీకు సంస్కృతి వ్యాప్తి చెందడం వలన కొత్త హెలెనిస్టిక్ నాగరికత ఏర్పడింది. ఈ చిహ్నాలు సా.శ. 15 వ శతాబ్దం మధ్యలో బైజాంటైన్ సామ్రాజ్య సంప్రదాయాలలో స్పష్టంగా ఉండేవి. 1920 ల్లో గ్రీకులపై మారణహోమం జరిగే వరకూ గ్రీకు మాట్లాడేవారు మధ్య, తూర్పు అనాటోలియాలో ఉండేవారు. అలెగ్జాండర్ అకిలెస్ లాగానే పురాణ పురుషుడయ్యాడు. గ్రీకు, గ్రీకుయేతర సంస్కృతుల చరిత్రలో పౌరాణిక సంప్రదాయాల్లో అలెగ్జాండరు ప్రముఖంగా కనిపిస్తాడు. అతను యుద్ధాల్లో జీవితాంతం అజేయంగా నిలిచాడు. సైనిక నాయకులు తమను తాము పోల్చుకోడానికి అతడొక కొలబద్ద అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలటరీ అకాడమీలు ఇప్పటికీ అతని వ్యూహాలను బోధిస్తున్నాయి. [6] [c] చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకడిగా అలెగ్జాండరు స్థానం పొందాడు.[7]