ఆనంద్ మహీంద్రా
ఆనంద్ గోపాల్ మహీంద్రా (జననం 1 మే 1955) ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆయన మహీంద్రా గ్రూప్ ప్రస్తుత చైర్మన్. ముంబైకి చెందిన ఈ బిజెనెస్ గ్రూప్ లో ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, స్పేర్స్, నిర్మాణ పరికరాలు, డిఫెన్స్, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక మరియు భీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, విశ్రాంతి మరియు ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఆఫ్టర్ సేల్స్, రిటైల్.. ఇలా పలురకాల వ్యాపారాలున్నాయి. ఈ మహీంద్రా అండ్ మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా మనువడు ఆనంద్ మహీంద్రా నికర విలువ 2020 జనవరి నాటికి $1.6 బిలియన్లుగా అంచనా వేయబడింది.
ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి. 1996లో ఆయన భారతదేశంలో నిరుపేద బాలికల విద్య కోసమై నాన్హి కాలీ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించాడు. ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకులలో ఆయనను ఒకరిగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఎంపికచేసింది. అదే మ్యాగజైన్ 2011లో ఆసియాలోని 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఆనంద్ మహీంద్రా పేరు చేర్చింది. ఆనంద్ మహీంద్రాను ఫోర్బ్స్ (ఇండియా) 2013 సంవత్సరానికి 'ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్'గా గుర్తించింది. ఆయనకి 2020 జనవరిలో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు లభించింది.