అజీమ్ ప్రేమ్జీ
అజీమ్ ప్రేమ్జీ (జననం:జులై 24, 1945) గుజరాతుకు చెందిన ప్రముఖ ఇంజనీరు,, పారిశ్రామిక వేత్త. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన విప్రో సంస్థకు అధ్యక్షుడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం ప్రేమ్జీ 1999 నుంచి 2005 వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు.
వ్యక్తిగత జీవితం
అజీమ్ ప్రేమ్జీ గుజరాత్ నుంచి వచ్చి ముంబైలో నివసిస్తున్న ఒక షియా ముస్లిం కుటుంబంలో జన్మించాడు.ఆయన తండ్రి ఎం.హెచ్. ప్రేమ్జీ వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రాడక్ట్ కంపెనీ (దీన్నే తరువాత విప్రోగా మార్చడం జరిగింది)అనే సంస్థకు యజమాని. ఈ సంస్థ వంటనూనెలు ఉత్పత్తి చేసేది. ఆయన తాత బర్మాలో బియ్యం వ్యాపారం చేసేవాడు. అజీమ్ తండ్రిని మహమ్మదాలీ జిన్నా పాకిస్తాన్ కు వెళ్ళమన్నా ఆయన వెళ్ళలేదు.[6]
ముంబై లోని సెయింట్ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింలో విద్య నభ్యసిస్తుండగా తండ్రి 1966 లో హఠాత్తుగా కన్నుమూయడంతో చదువును అర్ధాంతరంగా వదిలిపెట్టి వ్యాపార వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది.అప్పటికి ఆయన వయసు 21 ఏళ్ళు. తరువాత ముప్ఫై ఏళ్ళకు మళ్ళీ పట్టుబట్టి అక్కడ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.[7]