సుందర్ పిచై
సుందర్ పిచై ఒక భారతీయ సాంకేతిక నిపుణుడు. 2015 లో ఇతను గూగుల్ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమితుడవడం వలన వార్తలలో నిలిచారు. భారత ప్రభుత్వం 2021కి గాను సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
నేపధ్యము
సుందర్ పిచాయ్ అసలు పేరు పి సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి సుందర్ గా, ఇంటిపేరును పి అనే పొడి అక్షరం నుంచి పిచాయ్ గా పూర్తిగా పొడిగించుకున్నారు. ఇతను చెన్నైలో పుట్టి, పెరిగారు. వనవాణి మెట్రిక్యులేషన్ పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియెట్ చదివారు. ఆ తర్వాత ఖరగ్పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు. ఉపాధ్యాయులు అక్కడే పీహెచ్డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లిన సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ కూడా చేశారు.
గూగుల్ లో చేరాక
2004లో గూగుల్ సంస్థలో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ విభాగం ఉపాధ్యక్షకుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. సెర్చి ఇంజిన్లలో దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్బార్ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 2014లో సంస్థలో రెండవ స్థానానికి ఎదిగాడు. సుందర్ పిచాయి, గూగుల్ లో చేరడానికి ముందు మెకిన్సే, అప్లైడ్ మెటీరియల్స్ సంస్థల్లో కూడా పనిచేశాడు. గూగుల్ లో పనిచేస్తుండగానే మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో అవకాశం వచ్చినప్పటికీ ఆయన వెళ్లలేదు.