సత్య నాదెళ్ల
సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ 'సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు. సత్య నాదెళ్ల హైదరాబాద్కి చెందిన ఒక ప్రవాస భారతీయుడు. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా ఇతను నియమితులయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ఇటుంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్ సుదీర్ఘ కాలం పనిచేశారు. భారత ప్రభుత్వం 2021కి గాను సత్య నాదెళ్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
నేపధ్యం
ఆయనది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. ఆయన తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ ఐఏఎస్కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్లో సత్య నాదెళ్ల జన్మించారు.[