మిల్ఖా సింగ్
మిల్ఖా సింగ్ (1935 నవంబరు 20 - 2021 జూన్ 18) భారత్ కు చెందిన సిక్కు అథ్లెట్. ఇతన్ని ఫ్లయింగ్ సిఖ్ అని పిలుస్తారు. అరుదైన, ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. 2013 నాటికి, కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా (అథ్లెట్) గుర్తింపు పొందాడు. భారత్ తరపున 1956 లో మెల్బోర్న్ నగరంలో జరిగిన వేసవి ఒలంపిక్స్ లోను, 1960 లో రోమ్ లో జరిగిన ఒలంపిక్స్ లోను, 1964 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ పోటీల్లోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. భారత ప్రభుత్వం ఇతన్ని "పద్మశ్రీ" పురస్కారంతో సత్కరించింది.
1960 ఒలింపిక్ పోటీల్లో అతడు పాల్గొన్న 400 మీటర్ల పరుగు పందెం అతడి కెరీర్లో చిరస్మరణీయమైనది. అందులో అతడు 4 వ స్థానంలో నిలిచాడు. ఆపోటీలో అతడు చేసిన 45.73 సెకండ్ల పరుగు, భారతదేశ రికార్డుగా 40 ఏళ్ళ పాటు నిలిచింది.
దేశ విభజన సమయంలో అనాథగా మారిన మిల్ఖా సింగ్, తరువాత కాలంలో భారతదేశపు ప్రసిద్ధ క్రీడా చిహ్నంగా అవతరించాడు. 2008లో రోహిత్ బ్రిజ్నాథ్ అనే ఒక పాత్రికేయుడు, మిల్ఖా సింగ్ ను "భారతదేశపు అత్యుత్తమ క్రీడాకారుడి"గా అభివర్ణించారు. జులై, 2012లో "ద ఇండిపెండంట్" అనే ఓ బ్రిటిష్ వార్తాపత్రిక,"మిల్ఖా సింగ్, భారత దేశపు అత్యుత్తమ క్రీడాకారుడు మాత్రమే కాదు, ఒక ఘనమైన పరాజితుడు కూడా" అని పేర్కొంటూ, అతడు సాధించిన విజయాలు అతి తక్కువని, వందకోట్లమందికి పైగా జనాభా ఉన్నప్పటికీ, భారతదేశం అతడి (మిల్ఖా సింగ్) ద్వారా 20 పతకాలు మాత్రమే సాధించగలిగిందని తమ పత్రికలో వ్యంగ్యంగా ప్రచురించింది.