శ్రీనివాస రామానుజన్
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26)[1] బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు. అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్నాడు. ఈయనలోని గణిత పరిశోధనా ప్రవృత్తి ఏకాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది. తన పరిశోధనలతో అప్పట్లో ప్రఖ్యాతి గాంచిన గణిత శాస్త్రవేత్తలకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఎందుకంటే రామానుజన్ కనుగొన్న సూత్రాలు అపూర్వమైనవి, అప్పటి దాకా ఎవరూ పరిచయం చేయనివి, దానికితోడు వాటిని రామానుజన్ సమర్పించిన విధానం కూడా విభిన్నమైనది. అయినా రామానుజన్ తన పట్టు విడవకుండా తన పరిశోధనను అర్థం చేసుకునే శాస్త్రవేత్తలకోసం వెతుకులాట కొనసాగించాడు. 1913లో ఆయన ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేసే జి. హెచ్. హార్డీ అనే గణిత శాస్త్రవేత్తను ఉత్తరాల ద్వారా సంప్రదించాడు. అతని పనిని చూసి ముగ్ధుడైన హార్డీ రామానుజాన్ని కేంబ్రిడ్జికి ఆహ్వానించాడు. రామానుజన్ ప్రతిపాదించినవి చాలా కీలకమైన సిద్ధాంతాలనీ, కొన్నైతే తాను కనీ వినీ ఎరుగనివని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు.
రామానుజన్ జీవించింది కొద్ది కాలమే అయినా, సుమారు 3900 ఫలితాలు రాబట్టాడు. అందులో చాలా వరకు సమీకరణాలు, అనన్యతలే. వీటిలో చాలా వరకు సరికొత్తయైనవి.