అడాల్ఫ్ హిట్లర్
సంక్షిప్త చరిత్ర
ఎడాల్ఫ్ హిట్లర్ లేదా ఏడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) (జననం: 20 ఏప్రిల్ 1889 - మరణం: 30 ఏప్రిల్ 1945). ఆస్ట్రియా లో జన్మించిన జర్మన్ నియంత. ఇతను 1933 నుండి జర్మనీ ఛాన్స్ లర్ గాను 1934 నుండి మరణించే వరకు జర్మనీ నేత (ఫ్యూరర్) గాను వ్యవహరించిన వ్యక్తి. ఇతడు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ (దీనినే నాజీ పార్టీ అంటారు) వ్యవస్థాపకుడు.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ ఆర్థికంగాను, సైనికంగాను భారీగా నష్టపోయింది. హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన సైనికుడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ పై మిత్ర రాజ్యాలు (Allies) - అనగా యునైటెడ్ కింగ్డ, ఫ్రాంసు, అమెరికా, వగైరాలు - విధించిన ఆంక్షలు హిట్లర్ లోని అతివాదిని మేలు కొలిపాయి. ఈ విపత్కర పరిస్థితులను హిట్లర్ తనకు అనుకూలంగా మలచుకొన్నాడు. అణగారిన మధ్య తరగతి ప్రజలను హిట్లర్ తన వాక్పటిమతో ఉత్తేజితులను చేసాడు. జర్మనీ పతనానికి యూదులే ముఖ్య కారణమని హిట్లర్ బోధించాడు. అతని ఉపన్యాసాలలో ఎప్పుడూ అతివాద జాతీయత, యూదు వ్యతిరేకత, సామ్యవాద (సోషలిస్ట్) వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించేవి. అధికారం లోకి వచ్చిన తరువాత పతనమైన ఆర్థిక వ్యవస్థను, నిస్తేజంగా ఉన్న సైనిక వ్యవస్థను దరి లోనికి తెచ్చాడు. ఇతని విదేశాంగ విధానం నియంతృత్వము తోనూ, ఫాసిస్ట్ (అనగా, ఒక విధమైన నియంతృత్వం) ధోరణి తోనూ నిండి ఉండేది. ఇతని విదేశాంగ విధాన లక్ష్యం జర్మనీ దేశ సరిహద్దులను పెంచడమే. ఇదే ధోరణితో ఇతడు ఆస్ట్రియా, పోలండ్, చెక్ రిపబ్లిక్ లపై దండెత్తాడు. ఇదే రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది.
రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభంలో అక్ష రాజ్యాలు (అనగా, జర్మనీ, ఇటలీ, జపాను) దాదాపు ఐరోపా అంతటినీ జయించాయి. కానీ క్రమంగా మిత్ర రాజ్యాల చేతిలో ఓడిపోయాయి. హిట్లర్ జాతి వ్యతిరేక విధానాల వలన యుద్ధం పూర్తి అయ్యేసరికి సుమారుగా 1.1 కోట్ల ప్రజలు మరణించారు. వీరిలో 60 లక్షల మంది యూదులు. దీనిని చరిత్రలో మానవ హననం (హోలోకాస్ట్)గా పేర్కొంటారు.
యుద్ధపు చివరి రోజులలో సోవియట్ యూనియన్కు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరం లోనికి ప్రవేశించగానే హిట్లర్ ఆ ముందు రోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్ తో కలిసి ఒక నేలమాళిగలో 1945 ఏప్రిల్ 30 మధ్యాహ్నం 3.30 కి ఆత్మ హత్య చేసుకొన్నాడు.
జర్మనీకి "నివసించే చోటు" (లేబెంస్రుం) ఒకటి సృష్టించాలనే ఆశయంతో హిట్లర్ ఒక విదేశీ విధానాన్ని రూపొందించాడు. దీని కోసం దేశ వనరులను ఆ ఆశయం వైపుగా మళ్ళించి, 1939 లో పోలండ్ మీదకి దండెత్తేడు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం యూరోపియన్ రంగస్థలంలో వ్యాప్తి చెందటానికి దారితీసింది
కేవలం మూడు సంవత్సరాలలో జర్మనీ, అక్ష రాజ్యాలు చాల మట్టుకు యూరోప్ను, ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణతూర్పు ఆసియా, పసిఫిక్ మహాసముద్రంలో కొంత భాగాన్ని ఆక్రమించాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ, 1942 నుండి మిత్రమండలి పై చేయి సాధించి, 1945లో అన్ని వైపుల నుండి జర్మనీ పై దండెత్తాయి.